కంటెంట్‌కు వెళ్లు

మనుషులు ఎందుకు చనిపోతున్నారు?

మనుషులు ఎందుకు చనిపోతున్నారు?

బైబిలు ఇచ్చే జవాబు

 మనుషులు ఎందుకు చనిపోతున్నారని ఆలోచించడం సహజమే. ముఖ్యంగా, మనకు ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు మనమలా ఆలోచిస్తాం. బైబిలు ఇలా చెప్తుంది: “మరణపు ముల్లు పాపము.”—1 కొరింథీయులు 15:56.

మనుషులందరూ ఎందుకు పాపం చేసి చనిపోతున్నారు?

 మొదటి మనుషులైన ఆదాము హవ్వలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినందుకు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. (ఆదికాండము 3:17-19) దేవుని మాట వినకపోతే వాళ్లకు చావు తప్పదు, ఎందుకంటే దేవుని దగ్గరే “జీవపు ఊట” ఉంది. —కీర్తన 36:9; ఆదికాండము 2:17.

 ఆదాము, పాపం ద్వారా వచ్చే ప్రభావాల్ని తన పిల్లలందరూ అనుభవించేలా చేశాడు. బైబిలు ఇలా చెప్తుంది: “ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.” (రోమీయులు 5:12) మనుషులందరూ పాపం చేసినందువల్లే చనిపోతున్నారు.—రోమీయులు 3:23.

మరణం ఇక ఉండదు, ఎలా?

 “మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన” మ్రింగివేసే సమయం వస్తుందని దేవుడు మాటిస్తున్నాడు. (యెషయా 25:8) చావును తీసేయాలంటే ముందుగా, దానికి కారణమైన పాపాన్ని ఆయన తీసేయాలి. దీన్ని దేవుడు, ‘లోకపాపాన్ని’ నిర్మూలించే యేసుక్రీస్తు ద్వారా చేస్తాడు.—యోహాను 1:29; 1 యోహాను 1:7.